హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లోనే జీహెచ్‌ఎంసీ సేవలు

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ సేవలు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్ ద్వారానే ఫిర్యాదులు చేయడం, పన్నులు చెల్లించడం వంటి పనులను చక్కబెట్టుకునేలా సరికొత్త వ్యవస్థను జీహెచ్‌ఎంసీ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాట్సప్ చాట్‌బాట్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.

ఈ చాట్‌బాట్ ద్వారా పౌరులు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సప్‌లో ఫిర్యాదు నమోదు చేయగానే, ఆ సమాచారం నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. ఏ సమస్యకు ఏ అధికారిని సంప్రదించాలో కూడా ఈ చాట్‌బాట్ తెలియజేస్తుంది. దీనితో పాటు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వంటి చెల్లింపులను కూడా ఇకపై వాట్సప్ నుంచే పూర్తి చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ సేవలు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో మాత్రమే ఉన్నాయి.

అంతేకాకుండా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు వంటివి ఎలా పొందాలో, ఎవరిని సంప్రదించాలో వంటి వివరాలను కూడా ఈ చాట్‌బాట్ అందిస్తుంది. వార్డుల వారీగా అధికారుల ఫోన్ నంబర్లు సహా పూర్తి సమాచారం ఇందులో లభిస్తుంది. ప్రస్తుతం చాలా మందికి ఆన్‌లైన్ సేవలు, అధికారుల వివరాలపై సరైన అవగాహన లేకపోవడంతో చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకే 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *