ప్రముఖ కంపెనీల కార్లలో భద్రతా లోపాలు.. 40 వేల వాహనాలు వెన‌క్కి

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన హ్యుందాయ్ మోటార్, ఫోర్డ్ సహా మరో మూడు సంస్థలు భారీ రీకాల్‌ను ప్రకటించాయి. తమ వాహనాల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఈ కంపెనీలు, మొత్తం 40,000కు పైగా వాహనాలను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ రీకాల్‌లో హ్యుందాయ్, ఫోర్డ్, డీఎన్ఏ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ కొరియా, స్టెల్లాంటిస్ కొరియా (జీప్ మాతృ సంస్థ) కంపెనీలు ఉన్నాయి. ఈ ఐదు కంపెనీలకు చెందిన 16 వేర్వేరు మోడళ్లలో మొత్తం 40,380 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, వాహనాల్లో పలు కీలకమైన సమస్యలను అధికారులు గుర్తించారు.

హ్యుందాయ్ వారి పాలిసేడ్ ఎస్‌యూవీలో హుడ్ లాచ్ బలహీనంగా ఉండటం, ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ ఎస్‌యూవీలో సీట్ బెల్ట్ బకిల్ బోల్టులలో లోపం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అదేవిధంగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ 300 4మ్యాటిక్ మోడల్‌లో స్టీరింగ్ సిస్టమ్‌కు సంబంధించిన భాగాలు వదులుగా ఉండటం, జీప్ వ్రాంగ్లర్ వాహనాల్లో యాంటెన్నా కేబుల్స్‌లో సమస్యలు ఉన్నట్లు తెలిపారు. డీఎన్ఏ మోటార్స్‌కు చెందిన యూహెచ్‌ఆర్125 మోటార్‌సైకిల్‌లో సెన్సార్ లోపం ఉన్నట్లు కూడా తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో వాహనాల్లో లోపాల కారణంగా రీకాల్స్ జరగడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్ నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్, జనరల్ మోటార్స్ వంటి సంస్థలు 14,000 లకు పైగా వాహనాలను భద్రతా కారణాలతో వెనక్కి పిలిపించాయి. అంతకుముందు మే నెలలో కూడా కియా, బీఎండబ్ల్యూ, హ్యుందాయ్ కంపెనీలు 16,000 లకు పైగా వాహనాలను రీకాల్ చేయడం గమనార్హం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *