భారత్‌కు ట్రంప్ భారీ షాక్.. 100 శాతం సుంకాలు విధించాలని ఈయూకు సూచన

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ కొత్త ఎత్తుగడ వేశారు. భారత్‌తో పాటు చైనాపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశంపై అమెరికా, ఈయూకు చెందిన సీనియర్ అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ట్రంప్, కీలక సూచనలు చేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్న భారత్, చైనాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసే వరకు ఈ రెండు దేశాలపై 100 శాతం సుంకాలు కొనసాగించాలని ఆయన సూచించినట్లు పేర్కొంది. ఈ దేశాలు రష్యా నుంచి చమురు కొనడం వల్ల ఆంక్షల ప్రభావం తగ్గుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై దిగుమతి సుంకాల భారాన్ని మోపింది. ఈ ఏడాది జులైలో 25 శాతం టారిఫ్ విధించగా, ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచింది. ఇప్పుడు ఏకంగా 100 శాతం సుంకాల కోసం యూరోపియన్ దేశాలను కూడా రంగంలోకి దించాలని చూడటం గమనార్హం.

ఆసక్తికరంగా, ఈ ప్రతిపాదన చేసిన సమయంలోనే ట్రంప్ మరోవైపు భారత్‌తో వాణిజ్య సంబంధాలపై సానుకూలంగా స్పందించారు. వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై చర్చిస్తానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఒకేసారి కఠినమైన ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు చర్చలకు సిద్ధమని చెప్పడం ట్రంప్ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *