ఉద్యోగులు బరువు తగ్గితే ఏ కంపెనీ అయినా అభినందిస్తుంది. కానీ, చైనాకు చెందిన ఓ టెక్ కంపెనీ మరో అడుగు ముందుకేసి బరువు తగ్గిన వారికి ఏకంగా కోటి రూపాయలకు పైగా బోనస్గా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
షెన్జెన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘అరాషి విజన్ ఇంక్’ (ఇన్స్టా360) అనే సంస్థ తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని చేబట్టింది. “మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్” పేరుతో ఏటా ఓ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో భాగంగా ఉద్యోగులు బరువు తగ్గితే భారీగా నగదు బహుమతులు అందిస్తోంది. ఆగస్టు 12న ప్రారంభమైన ఈ ఏడాది ఛాలెంజ్లో భాగంగా ఉద్యోగులు ప్రతి అర కిలో బరువు తగ్గితే 500 యువాన్లు (సుమారు రూ.6,100) ప్రోత్సాహకంగా ఇస్తోంది. మొత్తం బోనస్ విలువ మిలియన్ యువాన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.23 కోట్లు.
ఈ ఛాలెంజ్లో భాగంగా క్సీ యాఖీ అనే ఓ యువ ఉద్యోగిని “వెయిట్ లాస్ ఛాంపియన్”గా నిలిచింది. ఆమె కేవలం 90 రోజుల్లో 20 కిలోలకు పైగా బరువు తగ్గి 20,000 యువాన్లు (సుమారు రూ. 2.47 లక్షలు) నగదు బహుమతి గెలుచుకుంది. క్రమశిక్షణ, నియంత్రిత ఆహారం, రోజుకు గంటన్నర వ్యాయామం వల్లే ఇది సాధ్యమైందని ఆమె తెలిపింది. “ఇది కేవలం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. నన్ను నేను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం” అని ఆమె పేర్కొంది.
ఈ ప్రోత్సాహకంలో ఓ మెలిక కూడా ఉంది. బరువు తగ్గిన తర్వాత ఎవరైనా తిరిగి బరువు పెరిగితే, ప్రతి అర కిలోకు 800 యువాన్లు (సుమారు రూ.9,800) జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఎవరికీ జరిమానా విధించలేదని కంపెనీ తెలిపింది. 2022 నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు ఈ పోటీని నిర్వహించగా దాదాపు 2 మిలియన్ యువాన్లు (రూ.2.47 కోట్లు) బహుమతులుగా పంపిణీ చేశారు. గత ఏడాది 99 మంది ఉద్యోగులు కలిసి 950 కిలోల బరువు తగ్గి, మిలియన్ యువాన్ల బోనస్ను పంచుకున్నారు.
