కవిత జాగృతిలోకి మొదలైన చేరికలు.. కవిత పోరాటానికి మద్దతుగా ఉంటామన్న బీసీ నేతలు

V. Sai Krishna Reddy
1 Min Read

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దారుణంగా మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, చట్టసవరణ పేరుతో నాటకాలాడుతోందని ఆమె ఆరోపించారు.

శనివారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో పలువురు బీసీ సంఘాల నాయకులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గోపు సదానందం, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, అరె కటిక సంఘం నేత సురేందర్ తమ అనుచరులతో కలిసి జాగృతి తీర్థం పుచ్చుకున్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు ఈ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళతామని అసెంబ్లీలో హామీ ఇచ్చి మాట తప్పారని గుర్తు చేశారు.

ఒకవైపు కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండగా, మరోవైపు కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపడం బీసీలను మభ్యపెట్టడానికేనని ఆమె అన్నారు. గవర్నర్ బిల్లులను తొక్కిపెట్టినా, ప్రభుత్వం న్యాయపోరాటం చేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని కవిత స్పష్టం చేశారు. త్వరలోనే బీసీ సంఘాల నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *