దేశంలోని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆరేళ్లుగా కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని, క్రియారహితంగా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ పార్టీలపై వేటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, రిజిస్టర్ అయిన పార్టీలు క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే, 2019 నుంచి ఇప్పటివరకు ఈ 334 పార్టీలు ఏ ఎన్నికలోనూ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. అంతేకాకుండా, ఈ పార్టీలు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలలో వాటి కార్యాలయాలు భౌతికంగా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ స్పష్టం చేసింది. ఈ రెండు కీలక నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే వాటి గుర్తింపును రద్దు చేసినట్లు వివరించింది.
ఈ ప్రక్షాళన చర్యకు ముందు దేశంలో మొత్తం 2,854 రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలు ఉండేవి. తాజా నిర్ణయంతో 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2,520కి తగ్గింది. ఈ చర్య దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన పార్టీలకు వర్తిస్తుంది.
అయితే, ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని, క్రియారహితంగా ఉన్న పార్టీలకు మాత్రమే వర్తిస్తుందని ఈసీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఎన్నికల సంఘం వర్గాలు సూచించాయి.