ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత మార్కెట్లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ముంబైలో తొలి షోరూమ్ను ప్రారంభించి నెల తిరగకముందే, దేశ రాజధాని ఢిల్లీలో రెండో షోరూమ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 11న ఈ కొత్త టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో, “ఢిల్లీకి వచ్చేస్తున్నాం – వేచి చూడండి” అంటూ ఒక గ్రాఫిక్తో కూడిన పోస్ట్ను టెస్లా పంచుకుంది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ఏరోసిటీ ప్రాంతంలో ఉన్న వరల్డ్మార్క్ 3 కాంప్లెక్స్లో ఈ కొత్త షోరూమ్ను ఏర్పాటు చేస్తున్నారు.
గత నెల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో టెస్లా తన మొదటి షోరూమ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఆ సందర్భంగా, టెస్లా తన మిడ్సైజ్ ఎస్యూవీ ‘మోడల్ వై’ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 60 లక్షలుగా ఉంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి మోడల్ వై డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
టెస్లా మోడల్ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ 60 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక లాంగ్-రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీతో 622 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. తొలి దశలో ముంబై, పుణె, ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల్లోని వినియోగదారులకు డెలివరీలలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫ్లాట్-బెడ్ ట్రక్కుల ద్వారా నేరుగా వినియోగదారుల ఇంటికే కార్లను డెలివరీ చేయనున్నారు.
అంతేకాకుండా, తన వెబ్సైట్లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా టెస్లా కల్పించింది. ఇక రూ. 6 లక్షల అదనపు ధరతో లభించే ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) ఫీచర్ను మాత్రం భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.