ఏటీఎంలకు రూ.500 నోట్లు ఆపేయాలన్న ప్రతిపాదనేదీ లేదు: కేంద్రం

V. Sai Krishna Reddy
2 Min Read

దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేయనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రూ.500 నోట్లను ఆపే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ఏటీఎంలలో రూ.500 నోట్ల జారీ యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

ఈ విషయంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం నాడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజల లావాదేవీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏ నోట్లను ఎంత మేర ముద్రించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన వివరించారు. రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా వాట్సాప్‌లో వస్తున్న సందేశాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

అయితే, ప్రజలకు రూ.100, రూ.200 వంటి చిన్న డినామినేషన్ నోట్ల లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా, ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసిందని గుర్తుచేశారు. దాని ప్రకారం, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు.

సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లు వచ్చేలా చూడాలని, అలాగే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ సౌకర్యం కల్పించాలని ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించిందని పంకజ్ చౌదరి తన సమాధానంలో పేర్కొన్నారు.

కాగా, సెప్టెంబర్ 30 నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్లు నిలిచిపోతాయని, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలని సూచిస్తూ వాట్సాప్‌లో ఓ సందేశం విస్తృతంగా వ్యాపించింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా స్పందించింది. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏవీ జారీ చేయలేదని తేల్చిచెప్పింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *