విడుదలైన ‘మాస్ జాతర’ తొలి పాట.. ఫోక్ బీట్‌తో రవితేజ రచ్చ

V. Sai Krishna Reddy
1 Min Read

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాటను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ‘ఓలే ఓలే’ అంటూ సాగే ఈ జానపద గీతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చడమే కాకుండా, రోహిణి సోర్రత్‌తో కలిసి ఆలపించారు. భాస్కర్ యాదవ్ దాసరి అందించిన సాహిత్యం పాటకు మరింత ఊపునిచ్చింది. ఈ హుషారైన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. లిరికల్ వీడియోలో రవితేజ, కథానాయిక శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, వారి మాస్ స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.

పాట విడుదల సందర్భంగా రవితేజ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, “నాకు ఫోక్ బీట్స్‌కు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ ఇష్టమే. నేను ఎంజాయ్ చేసినట్లే మీరూ ఈ పాటకు వైబ్ అవుతారని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా, “రవితేజ, శ్రీలీల తెరపై అదరగొట్టారు. ఈ పాట ఫుల్ వైబ్‌తో ఉంది” అని పోస్ట్ చేసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *