అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వృద్ధులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో నలుగురూ అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులు.. ఆశా దివాన్, కిశోర్ దివాన్, శైలేష్ దివాన్, గీతా దివాన్.. నలుగురూ 80 ఏళ్లు పైబడిన వృద్ధులేనని పోలీసులు వివరించారు. ఈ వారం మొదట్లో నలుగురూ ప్రభుపాద ఆలయానికి కారులో బయలుదేరారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మధ్యలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగి లంచ్ చేశారని, ఆ తర్వాత వారి జాడ తెలియరాలేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వృద్ధులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, కారులోని నలుగురూ అక్కడికక్కడే చనిపోయారని గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.