రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెంజర్ల హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని పెంజర్ల గ్రామంలో ఓ యువకుడు తన అక్కను హత్య చేసిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన ఓ యువకుడితో అక్క రుచిత(21) ఫోన్ లో మాట్లాడుతోందని తమ్ముడు రోహిత్ (20) గొడవపడ్డాడు. అయినా ఆమె వినకపోవడంతో అక్క వల్ల గ్రామంలో తమ కుటుంబం పరువు పోతోందని ఆగ్రహించి, రోహిత్ వైరుతో రుచిత మెడకు ఉరిబిగించి హత్య చేశాడు. హత్యకు ముందురోజు రోహిత్ ఇన్ స్టాలో పెట్టిన ఓ రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా” అంటూ రోహిత్ రీల్ చేశాడు. దీంతో అక్క వల్ల కుటుంబం పరువు పోతుందనే కారణంతో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ పథకం ప్రకారమే రుచితను హత్య చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.