గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది. ఇకపై మీ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే పౌర సేవలను పొందే అవకాశం రానుంది. సమస్యలపై ఫిర్యాదులు కూడా ఆన్లైన్లోనే చేసే వెసులుబాటు రానుంది. “ఒక నగరం.. ఒక వెబ్సైట్.. ఒక మొబైల్ యాప్” అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఒక విప్లవాత్మకమైన కొత్త డిజిటల్ వేదికను రూపొందిస్తోంది.
ఈ కొత్త వెబ్సైట్, మొబైల్ యాప్లో మీరు మీ ఫోన్ నంబర్తో లాగిన్ అయితే చాలు. ఆ నంబర్కు అనుసంధానమైన మీ ఆస్తి పన్ను వివరాలు, ఇంటి నిర్మాణ అనుమతులు, జనన ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్స్, పెంపుడు జంతువుల లైసెన్స్, గుత్తేదారుల కాంట్రాక్టులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్లు, క్రీడా సభ్యత్వాలు, ఇతర ముఖ్యమైన వివరాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిని సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, కొన్ని సేవలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఫిర్యాదుల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ఒక సమీకృత కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేస్తోంది.
ప్రస్తుత డిజిటల్ సేవలు.. కొత్త వేదిక ఆవశ్యకత
ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తులు డిజిటలీకరణ అయ్యాయి. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఈ సేవలకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ‘మైజీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, ఈ సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడడం లేదని, కొన్ని పరిమితులు, లోపాలు ఉన్నాయని గుర్తించారు.
ఈ లోపాలను సరిదిద్ది, మరిన్ని అదనపు ఫీచర్లతో కొత్త డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్ నిర్ణయించారు. ఫోన్ నంబర్తో వినియోగదారులకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయడం ద్వారా వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు సులభంగా కనిపించేలా సాఫ్ట్వేర్ను రూపొందించాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి ఆయన ఆదేశాలు జారీ చేశారు.