భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి నెల రోజులపాటు ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన థాయ్లాండ్లో చోటు చేసుకుంది.
44 ఏళ్ల థవీసక్కు అతని భార్య విడాకులు ఇచ్చింది. వారికి పదహారేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని థవీసక్ వద్దే ఉంచి ఆమె వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్ళడంతో తీవ్ర వేదనకు గురైన థవీసక్ ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేశాడు. రోజంతా బీర్లు తాగుతూ గడిపాడు.
దీంతో అతని శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఒక స్వచ్ఛంద సంస్థ థవీసక్ను ఆసుపత్రిలో చేర్పించాలని ప్రయత్నించింది. అయితే, స్వచ్ఛంద సంస్థ సభ్యులు అతని ఇంటికి చేరుకునేలోపే థవీసక్ మరణించాడు. విచారణ జరిపిన అధికారులు అతని గదిలో 100 బీరు సీసాలను గుర్తించారు. అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్లే అతను మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.