* కాంట్రాక్టర్ నిర్లక్ష్యనికి రోడ్డు దుస్థితి
* వంతెన నిర్మించాలని డిమాండ్
* భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్
నర్సాపూర్/శివంపేట (ప్రజాజ్యోతి) మండల వ్యాప్తంగా గత ఐదు రోజులు నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని చుట్టుపక్క ప్రాంతాలలోని చెరువులు కుంటలు నిండి పాంబండ, పోతుల గూడ ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఆ దారి గుండా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, శివంపేట మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, జిల్లా కార్యదర్శి అశోక్ సాధులతో కలిసి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి రోడ్డు ధ్వంసం అయిందని కాంట్రాక్టర్ పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రదేశంలో మూడు చెరువుల నీటి సమూహ కలయికను గమనించకుండా వంతెనకు బదులు కల్వర్టు నిర్మించారాని, ఇక్కడే నీటిపారుదల శాఖ, రాష్ట్ర ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యం వహించిందో అర్థమవుతుందన్నారు. రోడ్డుకు సంబంధిత నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు గమనించి తిరిగి రోడ్డు పనులు ప్రారంభించి, వంతెన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండల్ రావు గారు, జిల్లా కార్యదర్శి ఎరుకల బిక్షపతి, పాంబండ గ్రామ అధ్యక్షులు దుబ్బ శేఖర్, మాజీ సర్పంచ్ గోప్యా నాయక్, భాస్కర్, మల్లేష్ యాదవ్, సుధాకర్, వెంకటేష్, రత్నాకర్, నాగరాజు, విట్టల్ నాయక్, నవీన్, భాను ప్రకాష్, సుమన్, వంశీ, రాంసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
