ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం

V. Sai Krishna Reddy
2 Min Read

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన విశిష్ఠ‌ రాజనీతిజ్ఞతకు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించింది. బుధవారం ఘనా రాజధాని అక్రలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా ఈ అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు.

ఈ గౌరవం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తాను 140 కోట్ల మంది భారతీయుల తరఫున స్వీకరిస్తున్నానని తెలిపారు. భారత యువత ఆకాంక్షలకు, దేశ సాంస్కృతిక వైవిధ్యానికి, అలాగే భారత్-ఘనా మధ్య ఉన్న చారిత్రక బంధానికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రత్యేక గౌరవం అందించినందుకు ఘనా ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. “ఘనా అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది భారత్-ఘనా మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలకు నిదర్శనం” అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి ఈ పురస్కారం లభించడంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. గ్లోబల్ సౌత్ దేశాల వాణిని బలోపేతం చేయడానికి మోదీ చేస్తున్న నిరంతర కృషికి లభించిన గుర్తింపు ఇద‌ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఘనాతో మన స్నేహానికి, సహకారానికి ఇది నిదర్శనమని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు తనపై కొత్త బాధ్యతను పెంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదటగా ఘనా చేరుకున్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఘనా అధ్యక్షుడు మహామ మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం ఇరు దేశాలు తమ సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్య’ స్థాయికి పెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. తన చారిత్రక పర్యటన భారత్-ఘనా సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *