సూర్యాపేట టౌన్,జూన్ 30(ప్రజాజ్యోతి):సూర్యాపేట పట్టణంలో వర్షాకాలం నేపథ్యంలో దోమల పెరుగుదలను అడ్డుకునేందుకు ప్రజలు ఇంటి వద్ద నుంచే శుభ్రత పాటించాలి అని మున్సిపల్ అధికారులు తెలిపారు.శిధిల భవనాలు,చెత్త వేరుదీసే విధానం,వీధి కుక్కల నియంత్రణపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పట్టణంలో దోమల వృద్ధి అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మున్సిపల్ అధికారులు సూచించారు.మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ డీ.ఈ సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ లు 26 వ వార్డులో సోమవారం జరిగిన వంద రోజుల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.వారు మాట్లాడుతూ ఇంట్లోని కూలర్లు,వాడిన టైర్లు,చెట్ల తొట్టిళ్లు,నీరు నిలిచే ప్రాంతాల్లో మురికినీరు నిల్వ కాకుండా చూసుకోవాలని,పరిశుభ్రతను కాపాడితే దోమల వృద్ధిని నిరోధించవచ్చని వివరించారు.వర్షాకాలంలో శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం మానుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు.తదితరంగా గృహ,వాణిజ్య,వ్యాపార యజమానులు తడి,పొడి,హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు.వీధుల్లో సంచరించే కుక్కలపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పెంపుడు కుక్కలకు బెల్టులు,అవసరమైన టీకాలు వేయించాలి అన్నారు.మున్సిపల్ సరఫరా చేసే నీటి నాణ్యతను టెస్టింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.నిరుపేద మహిళలను స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసి, చిరు వ్యాపారులకు స్ట్రీట్ వెండర్ సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకున్నట్లు వివరించారు.రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని శిధిలావస్థలో ఉన్న భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ వసూలు చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.