దేవభూమి ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ముందుజాగ్రత్త చర్యగా చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్, రుషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్నగర్ వంటి కీలక ప్రాంతాల్లో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు యాత్రికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు.
రహదారుల మూసివేత
వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులు మూతపడ్డాయి. చమోలీ జిల్లాలోని నందప్రయాగ్ భానర్పానీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. యాత్రికులు, స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు