భారీగా పతనమైన బంగారం ధర: ఒక్కరోజే రూ.930 తగ్గుదల.. కారణాలివే

V. Sai Krishna Reddy
2 Min Read

అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీయడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పతనమైంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాజనక నివేదికలు రావడంతో పెట్టుబడిదారులు బంగారంపై అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనికి తోడు లాభాల స్వీకరణ కూడా తోడవడంతో పసిడి ధర ఒక్కరోజే భారీగా దిగివచ్చింది.

శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.930 తగ్గి రూ.97,670కి చేరింది. గురువారం ముగింపు ధర రూ.98,600గా ఉన్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అదేవిధంగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.850 తగ్గి రూ.97,200 వద్ద స్థిరపడింది. గురువారం ఈ రకం బంగారం ధర రూ.98,050గా ఉంది.

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచే కొత్త పరిణామాలు ఏవీ లేకపోవడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి మదుపరులు తమ లాభాలను స్వీకరిస్తున్నారని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా విశ్లేషించారు. “ఇరాన్ సంయమనం పాటించడంతో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. ఇది మార్కెట్‌లో రిస్క్ భయాన్ని తగ్గించి బంగారం ధరలపై మరింత ఒత్తిడి పెంచింది” అని ఆయన వివరించారు.

మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా బులియన్ ధరల పతనానికి కారణమయ్యాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ నిధులను ఈక్విటీలు, క్రిప్టోకరెన్సీల వంటి రిస్క్ ఉన్న ఆస్తుల్లోకి మళ్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బంగారం బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,03,000కి చేరింది. గురువారం ఈ ధర రూ.1,03,100గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 43.45 డాలర్లు (1.31 శాతం) తగ్గి 3,284.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *