వివాదాల్లో జీజీహెచ్…
దారి తప్పుతున్న పాలన
చక్రం తిప్పుతున్న కనిపించని హస్తం
పోలీసుల భద్రత పేరుతో తప్పని ఇబ్బందులు
మీడియా ఆంక్షలపై అనుమానాలు
నిజామాబాద్ బ్యూరో, ప్రజాజ్యోతి, జూన్ 26 :
అది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్). అక్కడ పోలీసుల భద్రత మధ్య వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఏ సమస్య వచ్చిన ముందు పోలీసులు కలగజేసుకోవడం పరిపాటిగా మారింది. కానీ ఆసుపత్రి అధికారులు మాత్రం సమాధానం చెప్పరు. ఇక మీడియా ప్రతినిధులు కనిపిస్తే పోలీసుల హడావిడికి అంతే ఉండదు. సమస్య ఉన్నంత వరకు ఆసుపత్రి అధికారులు మాత్రం మీడియా ముందుకు రారు. ఇదేమిటి అంటే అది అంతే. ఆఫీసుకు వెళ్ళండి, సార్ వాళ్లతో మాట్లాడండి అంటూ పోలీసులే సమాధానం చెపుతున్నారు. కనీసం ఫోటో తీయాలన్న వీడియో తీయాలన్న ఆసుపత్రి సూపరింటెండెట్ అనుమతి కావాలి అని చెపుతున్నారు. కానీ అప్పటికే మీడియా ప్రతినిధులను తప్పించేందుకు బాధితులను అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇదంతా ఎందుకు.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకు ఈ ఆంక్షలు…?
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంబంధాలు ఉన్న శాఖల్లో మీడియాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు అని చెప్పారు. కానీ నిజామాబాద్
జీజీహెచ్ లో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అడుగు అడుగున పోలీసులు నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో రోగుల పట్ల వైద్యులు సిబ్బంది ప్రవహి ప్రవర్తిస్తున్న తీరు పై మీడియాకు ఆంక్షలు విధిస్తున్నారు . దీనికి తోడు కొంతమంది వైద్యులు జిజిహెచ్ నుంచి రోగులను తమ సొంత ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అలాగే భోజన వసతి ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే భోజన వసతి ఏర్పాటు చేసే కాంట్రాక్టర్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కాంట్రాక్టర్ ను మార్చి మరో వ్యక్తితో భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. అసలు కాంట్రాక్టర్ పత్తా లేడని, మరో వ్యక్తి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా కొందరు వైద్యులు రోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ బయటకు పంపిస్తున్నారు. అందుకు ఉదాహరణ పెర్కిట్ కు చెందిన బుజ్జమ్మ సంఘటననే. మీడియా అక్కడికి రాకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదు. రోగితో అటెండర్ లేకపోతె వైద్యం చెయ్యమని చెప్పడం, సిబ్బంది సైతం అనామకుల పట్ల దాస్టికంగా వ్యవహరించడం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు రోగులు జిజిహెచ్ లో ఆత్మహత్యలకు పాల్పడ్డ సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యం గా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సంఘటనలు జరుగుతున్నాయానే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరిగిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ ఐదంతస్తుల మేడలో ఏం జరుగుతుందో అనే విషయం బయటకు పోకుండా ఆసుపత్రికి అధికారులు ముందు జాగ్రత్తగా పోలీసులకు భద్రత కు హుకుం జారీ చేస్తున్నారు దీంతో ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఎవరు కనిపించిన వారిని దొంగలుగా చూస్తూ వారి వెంట ప్రత్యేకంగా పోలీసులు ఉండటం గమనార్హం. రోగులకు వైద్య సేవలు అందించి శాంతి ఆరోగ్య ప్రదాతలుగా ఉండాల్సిన ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతర్గతంగా జరుగుతున్న అక్రమాలు బయటకు రాకుండా ముందు జాగ్రత్తగా భద్రత ఏర్పాటు చేసి మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారనేది బహిరంగం.
కనిపించని హస్తం ఎవరిది.?
జిజిహెచ్ లో సూపర్డెంట్ పోస్ట్ కోసం గత నాలుగు సంవత్సరాలుగా పైరవీలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఇన్చార్జి సూపరింటెండెంట్ ను తొలగించి రెగ్యులర్ సూపరింటెండెంట్ ను తీసుకువచ్చారు. కానీ జిజిహెచ్ లో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. వాస్తవానికి జిజిహెచ్ లో రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ ముఖ్యంగా వైద్యులు సిబ్బంది కారణంగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సీనియర్ వైద్యులు జూనియర్ వైద్యులు మధ్య అలాగే సీనియర్ సిబ్బంది జూనియర్ సిబ్బంది అంటూ రెండు వర్గాలుగా ఏర్పడి తమకు అనుకూలంగా వ్యవహరిస్తూ పనులు చేసుకోబోతున్నారు. ఇక కొంతమంది వైద్యులు అయితే తమ ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరవుతున్నారు. ముఖ్యంగా సొంత ఆస్పత్రులు ఉన్నవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రెండు వర్గాలుగా ఏర్పడి డ్యూటీలకు ఎగనామం పెడుతున్నారు. దీంతో రోగులకు సేవలు అందించాల్సిన పరిస్థితులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఇటీవల ఒక పత్రిక రిపోర్టర్ వైద్యుల రిజిస్టర్ వివరాలు అడిగితే వివాదానికి దారి తీశారు. అలాగే మరో ఆర్టిఐ కార్యకర్త వైద్యుల వివరాలు ఇవ్వాలని ఎవరెవరు ఏ ఏ హోదాలో పని చేస్తున్నారని అడగగా ఆసుపత్రి అధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదంతా జరుగుతున్న ఈ తతంగం వెనకాల ఓ కనిపించని వైద్యుడు హస్తం పని చేస్తుంది. జిజిహెచ్ లో ఏ బడ్జెట్ ఫైల్ కదలాలన్నా, ఉన్నతాధికారులకు వెళ్లే ఏ ఫైల్ మీద సంతకాలు కావాలన్నా ముందుగా సదరు వైద్యుడు తమ ప్రైవేటు క్లినిక్ లో ఈ ఫైల్లను పరిశీలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు వైద్యుడు సిగ్నల్ ఇస్తే గాని ఆసుపత్రిలో అధికార వర్గాలు పనిచేయడం లేవనేది బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ సూపర్డెంట్ గా పని చేయాలి అంటే తన కనుసన్నాలో జరగాలని కోణంలో వ్యవహారం సాగుతుందని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైద్యుల సంఘం లో పట్టుకోల్పోకుండా ఉంటూ జి జి హెచ్ లోను మెడికల్ కళాశాలలను తమ పంతానికి నెగ్గిచ్చుకుందేందుకు ఓ ఇద్దరు వైద్యులు ఆసుపత్రి సేవలను బ్రష్టుఫాస్ట్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం కొనసాగుతున్నాయి. అందుకే ఈ కనిపించని హస్తం ఆస్పత్రికి వ్యవహారాల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది.