జర్నలిస్టుల జోలికి పోయినోళ్ళు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదు – ప్రశ్నించే గొంతుకలపై మీ ప్రతాపమా..!! – ఇచ్చిన ఇండ్లు లాక్కోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలననా..! – పాలన రెండేళ్లయిన లక్ష ఇండ్లు ఎక్కడ ..? – జర్నలిస్ట్ దీక్షలకు సంపూర్ణ మద్దతు : మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్

4 Min Read

మహబూబ్ నగర్ జూన్ 24 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) జర్నలిస్టుల జోలికి పోయిన వాళ్ళు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదని వాళ్ళు కన్నెర్ర చేస్తే మట్టికొట్టుకు పోతారని, ప్రశ్నించే గొంతుకలపై మీ ప్రతాపమా,
మీరు ఇవ్వకపోగా గతంలో ఇచ్చిన ఇండ్లు లాక్కోవడమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనా అని మాజీ మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. మంగళ వారం
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంపూర్ణ మద్దతు పలికారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ అధ్యక్షతన రెండో రోజు కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఇక్కడ దీక్షలు చేపట్టిన జర్నలిస్టులు సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు చేస్తున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ఇప్పటికే గూడు లేక పేదరికంలో మగ్గుతున్న అనేకమంది జర్నలిస్టులలో నలుగురు జర్నలిస్టులు మృత్యువాత పడిన విషయం ఆయన గుర్తు చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 150 మంది జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేశామన్నారు. కొన్ని పొరపాట్ల వల్ల కొందరు చెప్పుడు మాటల వల్ల అర్హులైన కొంతమంది జర్నలిస్టులకు ఇల్లు రాని మాట వాస్తవమేనని అన్నారు. ఎక్కడైనా జాబితా తయారు చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం మందికి ఇండ్లు ఇచ్చామని మిగిలినవి 20 శాతం మందికి ఇచ్చే ప్రక్రియలో ఉండగా తమ ప్రభుత్వం అధికారం కోల్పోయింది అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం విలేకరులను ఆదుకోవాల్సింది పోయి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను బలవంతంగా తాళాలు వేసి నోటీసులు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. ఇదివరకే పట్టాలు ఇచ్చి కేటాయించిన ఇండ్లను లాక్కొనే అధికారం ఎవరికి లేదని , దీనిపై న్యాయపోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎస్పీనీ కలిసి సంబంధిత శాఖ అధికారులపై ఫిర్యాదు చేయాలన్నారు. దీక్షల సందర్భంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులకు మద్దతు పలికారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి కీలకంగా వ్యవహరిస్తున్న పాత్రికేయులకు నేటికీని ఇండ్లు రాకపోవడం దురదృష్ట కరమన్నారు. పెట్టుబడిదారుల పనులు రోడ్డు మీదకు రాకుండాగానే జరిగిపోతాయి అన్నారు. అదే నిరుపేదల విషయానికొస్తే రోడ్డపైకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయాల్సిన పరిస్థితి ప్రజా ప్రభుత్వం లో నెలకొందన్నారు. రిటైర్డ్ సెంట్రల్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేసి వెంకటేశ్వర్లు జర్నలిస్టుల దీక్షలకు మద్దతు పలికారు. టి ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లె పోగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్వీఎస్ గుట్ట సర్వేనెంబర్ 25 లో జర్నలిస్టులకు కేటాయించిన స్థలం మా తాతదే అని సమాజ సేవ చేస్తున్న జర్నలిస్టుల కోసం అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పిన మాట ప్రకారం దారాదత్తం చేశామని తెలిపారు . అయితే స్థానికులకు బడుగు బలహీన వర్గాలకు కాకుండా నలగొండ, వరంగల్, నిజాంబాద్ ఇతర జిల్లాల వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి స్థానికులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. దారిద్ర రేఖ దిగువన నియమ నిబంధనలు దాటి ఉన్నత వర్గాలకు చెందిన వారికి ఇండ్లు కేటాయించారని మండిపడ్డారు. జర్నలిస్టులు చేస్తున్న ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.
బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులు వృత్తిపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ కన్వీనర్ మైత్రి యాదయ్య మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న దీక్ష పేద జర్నలిస్టుల ఇండ్ల సాధన కోసమే అని గుర్తు చేశారు. ఈ విషయంలో మీకు న్యాయం జరిగేలా మేము ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు అభివృద్ధి ఫోరం కన్వీనర్ విశ్వనాధ్ బాండేకర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లు చేస్తున్న దీక్షలకు సంపూర్ణ మద్దతుగా ఉంటామని. కాంగ్రెస్ ప్రభుత్వంతో మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.
జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. న్యాయం జరగకపోతే న్యాయస్థానానికి ఆశ్రయిస్తామన్నారు. పాలకుల వైఖరి మారాలన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, మైత్రి యాదయ్య, ఎమ్మార్పీఎస్ ఉత్తర తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్, విశ్వనాథ్ బండేకర్ తదితరులు జర్నలిస్టులకు సంఘీభావని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ రఫీ, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉమామహేశ్వరరావు, మొయిజు , ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పసుపుల శ్రీనివాస్, జర్నలిస్టులు కటిక రవీందర్, రవీందర్, శామ్యూల్ సుందర్ చారి, బాలు, ఎం ఏ అలీమ్, ఎంవి రమణ , ఆర్ కే న్యూస్ శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, రామ్మోహన్, రామకృష్ణ, వేణుగోపాల్ గౌడ్ , ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజసింహుడు , రంగినేని మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *