మధ్య వయస్కులు, వృద్ధులు నేలపై కూర్చున్న తర్వాత ఎంత సులభంగా లేవగలరనే దాని ఆధారంగా మరణముప్పును అంచనా వేయొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీనిని ‘సిట్టింగ్-రైజింగ్ టెస్ట్’ (ఎస్ఆర్టీ) అని పిలుస్తారు. ఈ పరీక్ష ద్వారా ఒక వ్యక్తి కండరాల బలం, వాటి మృదుత్వం, శరీర సమతౌల్యత, శరీర నిర్మాణ తీరు వంటి కీలక సమాచారాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్రెజిల్కు చెందిన ఒక నిపుణుల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా 46 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు 4,300 మంది వ్యక్తులను పరిశీలించారు. ఈ పరీక్షలో పాల్గొన్న వారికి 0 నుంచి 5 వరకు పాయింట్ల రూపంలో స్కోరు కేటాయించారు. నేలపై కూర్చోవడానికి లేదా కూర్చున్న తర్వాత పైకి లేవడానికి మోకాళ్ల సహాయం తీసుకున్నా, వేరొకరి సపోర్ట్ తీసుకున్నా ప్రతిసారీ వారి స్కోరు నుంచి ఒక పాయింట్ను తగ్గించారు. అలాగే, కదలికల సమయంలో స్థిరత్వం లోపించిన వారికి 0.5 పాయింట్లను తగ్గించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని సుమారు 12 సంవత్సరాల పాటు నిపుణులు పర్యవేక్షించారు. ఈ సమయంలో మొత్తం 665 మరణాలు సంభవించినట్లు గుర్తించారు. ‘సిట్టింగ్-రైజింగ్ టెస్ట్’లో తక్కువ స్కోరు సాధించిన వారికి మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. తక్కువ స్కోరు వచ్చిన వారిలో మరణాల రేటు 42 శాతంగా ఉండగా, ఎక్కువ స్కోరు సాధించిన వారిలో ఇది కేవలం 3.7 శాతంగానే నమోదైందని అధ్యయనంలో తేలింది.
అలాగే, ఈ రెండు సమూహాలను పోల్చి చూసినప్పుడు, తక్కువ స్కోరు ఉన్నవారు గుండె సంబంధిత వ్యాధులతో మరణించే అవకాశం 500% అధికంగా ఉందని, సహజ కారణాలతో మరణించే అవకాశం కూడా 300% ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా సమాజంలోని వివిధ వర్గాలపై ఈ ‘సిట్టింగ్-రైజింగ్ టెస్ట్’ను ప్రయోగించి చూశామని, ఇది అత్యంత సులభమైన ఇంకా సంపూర్ణమైన ఫలితాలనిచ్చే పరీక్ష అని వారు వివరించారు. ఈ సాధారణ పరీక్ష ద్వారా వ్యక్తులు తమ శారీరక సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడమే కాకుండా, అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి వీలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.