కాంగ్రెస్‌లో ‘స్థానిక’ జంఝాటం

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద గుబులే క‌నిపిస్తోంది. జిల్లాలు, మండ‌లాల వారీగా నాయ‌కుల‌ప‌రిస్థితిపై నివేదిక‌లు తెప్పించుకుంటున్న పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌.. అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టుగా గుర్తించారు. పార్టీలోనే ఐక్య‌త లేక‌పోవ‌డం.. సీనియ‌ర్ వ‌ర్సెస్ సీనియ‌ర్ అన్న‌ట్టుగా కొన్ని జిల్లాల్లో వ్య‌వ‌హారాలు న‌డుస్తుండ‌డం గ‌మ‌నించారు. ఇక‌, మంత్రుల‌కు -ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదాలు కూడా కొన్ని జిల్లాల్లో కొన‌సాగుతున్నాయి.

మ‌రోవైపు.. పార్టీలో ‘కోవ‌ర్టులు’ ఉన్నార‌న్న‌ది కీల‌క విష‌యం. దీనికితోడు.. సొంత పార్టీ ప్ర‌భుత్వంపైనే కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. మీడియా మీటింగులు పెట్టి విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వంటివి రాజ‌న్ కు.. తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరుతో పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌న్న‌ది న‌ట‌రాజ‌న్ ఆవేద‌న‌గా ఉంది. క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగ‌క‌పోవ‌డం కూడా.. చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ ప్ర‌భావం వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఆమె యోచిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ‘పంచాయ‌తీరాజ్ సంఘ‌ట‌న్‌’ పేరుతో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ని విజ‌య‌తీరాల‌కు చేర్చేందుకు, స్థానికంగా నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను పెంచేందుకు కృషి చేయాల‌ని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు లేకుండా చూడాల‌ని.. పార్టీ అధికారంలో ఉన్న విష‌యాన్ని అంద‌రూ గ్ర‌హించేలా చేయాల‌ని కూడా ఆమె దిశానిర్దేశం చేశారు. ”ఒక‌వైపు వ్య‌తిరేక మీడియా ఉంది. మ‌రోవైపు.. మ‌న‌లో మ‌న‌మే త‌న్నుకుంటున్నాం. ఈ ప‌రిస్థితి ఎక్క‌డా లేదేమో.” అని తీవ్ర నిర్వేద వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే స్థానికంగా జ‌రిగే ఎన్నిక‌ల‌కు పార్టీని ఇప్ప‌టి నుంచి స‌మాయ‌త్తం చేయ‌డం.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల‌ను త‌గ్గించేదిశ‌గా అడుగులు వేయ‌డం.. పొర‌పొచ్చాల‌ను సాధ్య‌మైనంత‌గా చిన్న స్థాయిలోనే నిలువ‌రించే దిశ‌గా చర్య‌లు తీసుకునేందుకు న‌ట‌రాజ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌రి ఏమేర‌కు అవి స‌క్సెస్ అవుతాయో చూడాలి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *