ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు

V. Sai Krishna Reddy
2 Min Read

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన పలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి, సమాచారం సేకరించి, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది.

సమాచారం ప్రకారం, 2018 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ప్రణీత్ రావు, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా వ్యవహరించిన రాధాకిషన్‌రావుకు చేరవేసేవారని తెలుస్తోంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌ రావు ఆదేశాల మేరకే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి, ఈ ఆపరేషన్లు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే, హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌ వద్ద భవ్య ఆనంద్‌ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన రూ.70 లక్షల నగదును ఫోన్ ట్యాపింగ్ ద్వారా పొందిన సమాచారంతోనే టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్ చేశారని వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా, తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌రావు బంధువులకు చెందిన సుమారు కోటి రూపాయల నగదును కూడా ట్యాపింగ్ సమాచారం ఆధారంగానే స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ రాధాకిషన్‌రావు, ఆయన బృందం ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్‌కు సమాచారం అందింది. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నాయకుల అనుచరుల నుంచి సుమారు మూడున్నర కోట్ల రూపాయల నగదును కూడా అక్రమ నిఘా ద్వారా పొందిన సమాచారంతోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *