మహబూబ్ నగర్ జూన్ 20 ( ప్రజా జ్యోతి ప్రతినిధి ) కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నిష్ణాతులైన వారు ఈరోజు ఒక రోజు సెమినార్ లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. 40 స్టార్టప్స్ వచ్చాయని, వారు చేసిన ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణీకరణ అభివృద్ధి చెందడంతో పాటుగా నగర ప్రాంతాలలో వేస్టేజ్ కూడా అధికంగా పెరుగుతుందని ఆయన చెప్పారు. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యము అర్బన్ వేస్టేజ్ వలన అవుతుంది అని ఆయన అన్నారు. పెరుగుతున్న కాలుష్యం ద్వారా వివిధ రకాల చెడు బ్యాక్టీరియా లు మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని, చిన్నపిల్లలకు కూడా వాయు, నీటి కాలుష్యం ద్వారా ఇన్ఫెక్షన్స్ కలుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిని తగ్గించుట కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి ఎటువంటి స్కీమ్స్ అమలు చేస్తే నీటి కాలుష్యము , వాయు కాలుష్యము తగ్గించే అవకాశం ఉంటుందో వాటిని తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ వచ్చిన స్టార్టప్ లపైన పూర్తిగా అధ్యాయనం చేసి తప్పకుండా మన మహబూబ్ నగర్ నగరపాలక సంస్థకు అవసరమైన వాటిని వినియోగించుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు స్టాల్స్ ను ఆయన ప్రారంభించి సందర్శించి, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక,పట్టణ అభివృద్ది శాఖ కమీషనర్ టికె శ్రీదేవి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Leave a Comment