దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా, అన్ని రకాల టూవీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఈ నూతన విధానం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనుంది.
ప్రస్తుతం 150సీసీ పైబడిన ఇంజిన్ సామర్థ్యం గల బైక్లకు మాత్రమే ఏబీఎస్ నిబంధన వర్తిస్తోంది. అయితే, రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో, ఎంట్రీ లెవల్ మోడళ్లతో సహా అన్ని ద్విచక్ర వాహనాలకు దీనిని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో అధికశాతం అమ్ముడయ్యేది ఎంట్రీ లెవల్ బైక్లే కావడం, 2022 గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20 శాతం ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవే కావడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ మార్పుతో, ముఖ్యంగా తక్కువ శ్రేణి బైక్ల ధరలు సుమారు రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏబీఎస్ వ్యవస్థ అదనపు ఖర్చుతో కూడుకున్నప్పటికీ, ప్రయాణికుల భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర సమయాల్లో సడన్గా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా, వాహనం అదుపు తప్పకుండా నిరోధించడమే ఏబీఎస్ ముఖ్య విధి. తద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించడానికి లేదా పూర్తిగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది.