హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రిని కోరారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి కూలంకషంగా వివరించారు. సుమారు రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ప్రయాణం వేగవంతం కావడమే కాకుండా, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, తద్వారా సుస్థిరమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
పట్టణాభివృద్ధి శాఖ చేసిన సూచనల మేరకు మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన మార్పులు చేర్పులతో కూడిన సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇప్పటికే సమర్పించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరానికి మెట్రో రెండో దశ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇతర శాఖల నుంచి కూడా అనుమతులు త్వరితగతిన ఇప్పించాలని ఆయన కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మెట్రో విస్తరణ ఆవశ్యకత, ప్రయోజనాలపై సమగ్ర చర్చ జరిగినట్లు సమాచారం.