హైదరాబాద్లో రెండేళ్ల కిందట నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని.. మనీలాండరింగ్ కూడా జరిగిందని పేర్కొంటూ.. తెలంగాణ ఏసీబీ పోలీసులు నమోదు చేసిన కేసు లో బీఆర్ ఎస్ నాయకుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ను ఏ-1గా పేర్కొన్న విషయం తెలిసిందే. రెండు రోజు ల కిందట ఆయనను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. పలు ప్రశ్నలు కూడా సంధించారు. ఇదే సమయంలో కేటీఆర్ ఫోన్ల విషయాన్ని కూడా ఆరా తీశారు.
గతంలో వాడిన 8 ఫోన్లను తమకు స్వాధీనం చేయాలని కేటీఆర్ను ఆదేశించారు. అదేవిధంగా ట్యాబ్, ల్యాప్ టాప్లను కూడా తమకు ఇవ్వాలని.. కేసులో అవే కీలకమని పేర్కొన్నారు. వీటిని తదుపరి విచార ణకు తమకు స్వాధీనం చేయాలని అధికారులు కేటీఆర్ను ఆదేశించారు. అంతేకాదు.. ”స్పాట్లో మీ వద్ద ఫోన్ ఉందా?” అని ఆరా తీశారు. దీనికి లేదని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కారు పెట్టి ఉంటే తీసుకుర మ్మని ఆదేశించారు. తాను ఇంటి వద్దే వదిలేసి వచ్చానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
దీంతో తదుపరి విచారణకు ఫోన్లను తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ విషయం పై కేటీఆర్ తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో వారు కీలక సూచనలు చేశారు. సెల్ ఫోన్ కానీ, వ్యక్తిగతంగా వినియోగించుకునే ట్యాబులు, ల్యాప్ టాప్లు అనేది… `ప్రాథమిక హక్కుల` కిందకు వస్తాయని.. కాబట్టివాటిని ఎవరికీ చూపించాల్సిన, ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదులు తేల్చి చెప్పారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా ఉటంకించారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో .. కేజ్రీవాల్ ఫోన్లను ఇవ్వాలన్న ఈడీ న్యాయవాదులకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది. ఫోన్లు ప్రాధమిక హక్కుల కిందకు వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ తన ఫోన్లను, ట్యాబ్, ల్యాప్ టాప్లను ఏసీబీకి ఇచ్చేది లేదని.. కనీసం తీసుకువెళ్లేది కూడా లేదని తేల్చిచెప్పారు. మరి దీనిపై ఏసీబీఅధికారులు ఏం చేస్తారో చూడాలి. గతంలో కవిత ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ఢిల్లీ కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించిన విషయం గుర్తుండే ఉంటుంది.