అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు కీలక అప్డేట్. గత కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ప్రక్రియను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. అయితే, ఈసారి వీసా దరఖాస్తులతో పాటు దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను తప్పనిసరిగా పరిశీలించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ కొత్త నిబంధనపై విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఈ సోషల్ మీడియా తనిఖీ ద్వారా మా దేశంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని సమగ్రంగా పరిశీలించడానికి వీలు కలుగుతుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవసీ సెట్టింగ్స్ను ‘పబ్లిక్’గా మార్చుకోవాల్సి ఉంటుంది” అని తెలిపారు.
ఈ ఏడాది మే నెలాఖరు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కొత్తగా విద్యార్థి వీసాలకు దరఖాస్తు చేసుకునేవారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వీసా జారీ ప్రక్రియలో భాగంగా సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నందునే ఈ విరామం తీసుకున్నామని అప్పట్లో విదేశాంగ శాఖ పేర్కొంది. తాజాగా ఈ ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది.
‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటే ఏమిటి?
‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు అనుమతి ఇవ్వవచ్చా లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి వారి ఆన్లైన్ కార్యకలాపాలను, ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడం. ఉదాహరణకు ఒక విద్యార్థి తన సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లు గుర్తిస్తే, ఆ వ్యక్తిని మరింత లోతుగా పరిశీలిస్తారు. వారి వల్ల అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విద్యార్థికి దేశంలోని విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తూ స్టూడెంట్ వీసా మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా దేశ భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే, అర్హులైన విద్యార్థులకు అవకాశం కల్పించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.