- ప్రైవేటు పాఠశాలలా? పుస్తక వ్యాపార కేంద్రాలా?
వ్యాపార కేంద్రాలుగా మారిన విద్యాలయాలు
నిబంధనలు పాటించని యాజమాన్యాలు
— విద్యా వ్వస్థను గ్రిప్ లో పెట్టుకుంటున్న యాజమాన్యాలు
— డీఈవో మాటలు లెక్కచేయని ప్రైవేట్ యాజమాన్యాలు
— ఆ జీవో జర్నలిస్టుల పిల్లలకు వర్తించవు
– ఇష్టం ఉంటే చదివించండి లేదంటే టోటల్ ఫీ చెల్లించాల్సిందే..?
– ప్రభుత్వ నిబంధనలు జిల్లా కేంద్రంలో, గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ..?
(రామారెడ్డి జూన్ 18 ప్రజా జ్యోతి)
కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ విద్యాలయాలు పుస్తక విక్రయ కేంద్రాలుగా మారాయి. సరస్వతి నిలయాల్లో పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. “చదువు చారెడు బలపాలు దోసెడు” అనే విధంగా అడ్డగోలుగా పుస్తకాలను అంటగట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు ఫక్తు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు దర్జాగా పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తూ వాణిజ్య కేంద్రాలుగా మారాయి. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న తల్లిదండ్రుల కోరికను కార్పొరేట్ పాఠశాలలు ఆసరాగా చేసుకొని అందిన గాడికి దోచుకుంటున్నాయి. విద్య విలువలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలలో ఓ గదిలో పుస్తకాలను భద్రపరి పుస్తకాలు విక్రయిస్తున్నారు తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందించాల్సిన యాజమాన్యాలు ధనార్జన ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు పాఠశాల సిబ్బంది ఎంత రేటు చెబితే అంతే ఒక్కో తరగతికి ఒక రేటు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మార్పీ రేటుకు తగ్గకుండా అమ్మకాలు జరుపుతూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. కొన్ని పాఠశాలల మేము విక్రయిస్తున్న సంగతి అధికారులకు తెలుసునని ఎవరికి చెప్పిన మాకేం కాదు అని బాహాటంగా చెప్పడం గమనార్హం. మరికొన్ని పాఠశాల రూటు మార్చి తమ పాఠశాలకు సమీపంలో గదిని అద్దెకు తీసుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే యతేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు. నర్సరీ నుండి మొదలుకొని పదవ తరగతి వరకు విద్యార్థులకు అవసరం లేకున్నా బండెడు పుస్తకాలు అంటగడుతూ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ పాఠశాలలోనే పుస్తకాలు విక్రయిస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ అరికట్టాల్సిన అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండతోనే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధిక ధరకు పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలను తనిఖీ చేసి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.