అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ .. బాధితుల సొమ్ము చెల్లించేందుకు చర్యలు

V. Sai Krishna Reddy
1 Min Read

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అందింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.1000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను బాధితులకు అప్పగించేందుకు ఈడీ గత నెలలో దాఖలు చేసిన రెస్ట్రిట్యూషన్ అప్లికేషన్‌కు హైదరాబాద్ స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు తాజాగా ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్ యాజమాన్యం మూలంగా మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. బాధితులను ఆదుకునేందుకు ఈడీ కీలక ముందడుగు వేసింది.

తాజాగా అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి సీజ్ చేసిన రూ.611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించి ప్రభుత్వానికి అప్పగించింది. దీని ద్వారా ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి మార్గం సుగమమైంది. అప్పటి ఆస్తుల విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.1000 కోట్లకు పైగా ఉంటుంది. ఇంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈడీ సుమారు రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది.

ఇప్పుడు తాజా ఆస్తులతో కలిపి మొత్తం రూ.3,950 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు పునరుద్ధరించబడ్డాయి. ఈ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం రూ.7 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పునరుద్ధరించబడిన ఆస్తుల జాబితాలో 397 వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, వాణిజ్య స్థలాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటకలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తాజా పరిణామంతో అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలో చెల్లింపులు జరగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *