తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయ, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచింది. ఈ మేరకు ఉద్యోగుల డీఏ పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం జారీ చేసిన జీవోలు 78, 79లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ 26.39 శాతం ఇస్తుంది. తాజాగా మరోమారు డీఏ పెంచడంతో అది 30.03 శాతానికి చేరుతుంది. తాజాగా పెంచిన డీఏను జూన్ నెల వేతనంతో కలిపి ఇస్తామని, దీనిని జూలైలో ఉద్యోగులు అందుకోవచ్చని తెలిపింది. అంటే 2023 జనవరి 1వ తేదీ నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు అన్నింటినీ కలిపి ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారన్నమాట. ఇక ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఏ బకాయిలను మొత్తం 28 దఫాల్లో చెల్లించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు 10 శాతం డీఏ బకాయిలను ప్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది. మిగిలిన 90 శాతం బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో చెల్లించనుంది. ఇలా మొత్తం బకాలయిను నెలవారీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్స్ ఉద్యోగులకు డీఏ 38 శాతం నుంచి 42 శాతంకి పెంచారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 5 డీఏ బకాయిలు చెల్లించవల్సి ఉంది.
ఇటీవల రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగులకు 2 డీఏలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒక డీఏ తక్షణమే ఇవ్వనున్నారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఏ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా డీఏ పెంపు ఉత్తర్వులు జిల్లా, మండల, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. అలాగే ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీల్లో పని చేసే టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా వర్తిస్తుంది.