నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో తిరిగి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భారీ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కేరళ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
కేరళలోని కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాలకు ఐఎండీ 14, 15 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను ప్రకటించింది. దీంతో కన్నూర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లన్నీ ఈ రోజు, రేపు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు తీరప్రాంతంలో 35 – 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున 17వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.