తెలంగాణలో గొల్ల, కుర్మ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. గొల్లలు, కుర్మలు వేర్వేరు కాదని, వారంతా ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, “తెలంగాణలో గొల్ల, కుర్మలు కలిసి 28 లక్షల మంది ఉన్నారు. వీరిలో గొల్లలు 6 లక్షలు, కుర్మలు 22 లక్షల మంది ఉన్నారు. గతంలో కొందరు గొల్లలు, కుర్మలు వేరంటూ దుష్ప్రచారం చేశారు. కానీ అది వాస్తవం కాదు. ఈ రెండు సామాజిక వర్గాల తరఫున శాసనసభలో నేను ఒక్కడినే ప్రాతినిధ్యం వహిస్తున్నాను” అని తెలిపారు. తమ సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని కోరారు.
తమ డిమాండ్ల గురించి వివరిస్తూ, “గొల్ల, కుర్మలకు ఒక మంత్రి పదవి, ఒక ప్రభుత్వ సలహాదారు పదవి, ఒక ఎమ్మెల్సీ, ఐదు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఐదు కమిషన్ సభ్యుల పదవులు, పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్ పదవులు, ఎనిమిది ప్రధాన కార్యదర్శి పదవులు, ఐదు డీసీసీ అధ్యక్ష పదవులు కేటాయించాలి” అని బీర్ల ఐలయ్య విజ్ఞప్తి చేశారు. చరిత్రలో ఎన్నడూ గొల్ల, కుర్మలు లేకుండా రాష్ట్ర కేబినెట్ ఏర్పడలేదని, ఈసారి కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఆయన అన్నారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా త్వరలో కలిసి వివరిస్తామని ఐలయ్య తెలిపారు. “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకుంది. అయితే, గొల్ల, కుర్మలకు కూడా ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలి. మా డిమాండ్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, విద్య, రాజకీయ, ఉపాధి అవకాశాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని బీర్ల ఐలయ్య ప్రశంసించారు.