గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోబోతోందంటూ ఆయన పరోక్షంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సుమారు ఆరు నెలల తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్కు అమ్ముకుందని ఆయన ఆరోపించారు. అయితే, రానున్న ఉప ఎన్నికలో ఎంఐఎం నేతలు ముస్లిం ఓట్లను బీఆర్ఎస్కే విక్రయిస్తారా లేక కాంగ్రెస్ పార్టీకి అమ్ముతారా అనేది వేచి చూడాలని వ్యాఖ్యానించారు.
బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయానికొస్తే, గతంలో పార్టీలో కుల రాజకీయాలు నడిచాయని రాజాసింగ్ అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి కుల రాజకీయాలే పునరావృతమవుతాయా లేక పార్టీలోని సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తారా అనేది తేలాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ సోమవారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ పరిణామంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక అనివార్యమైంది.