భారత్, పాక్ ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు ఏం చెబుతోంది?

V. Sai Krishna Reddy
2 Min Read

వలసపాలన వారసత్వంగా సంక్రమించిన పేదరికంపై పోరులో రెండు పొరుగు దేశాలైన భారతదేశం, పాకిస్థాన్ ప్రయాణం ఎలా సాగుతుందో ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఈ రెండు దక్షిణాసియా దేశాల ప్రాధాన్యతలలో ఎంతటి వ్యత్యాసం ఉందో ఈ డేటా కళ్లకు కడుతోంది.

ఒకవైపు భారత్ అభివృద్ధి, పేదరిక నిర్మూలన మంత్రంతో దూసుకుపోతూ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి మరో బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తూ, నిధుల దుర్వినియోగం, తప్పుడు విధానాల కారణంగా పతనావస్థకు చేరుకుంటోంది.

భారత్ గణాంకాలు: అప్రతిహత ప్రగతి
ప్రపంచ బ్యాంకు ‘పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ’ నివేదిక ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, రోజుకు ప్రతి వ్యక్తికి $3 ఆదాయ పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నా, భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2011-12 మరియు 2022-23 మధ్య కాలంలో భారత్‌లో తీవ్ర పేదరికం రేటు 27.1 శాతం నుండి కేవలం 5.3 శాతానికి పడిపోయింది. సంఖ్యాపరంగా చూస్తే, 2011-12లో 34.44 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 7.52 కోట్లకు తగ్గింది. అంటే, కేవలం 11 సంవత్సరాలలో భారతదేశంలో సుమారు 26.9 కోట్ల మంది ప్రజలు, అంటే పాకిస్థాన్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది, తీవ్ర పేదరికం నుండి విముక్తి పొందారు. ఇది భారత ప్రభుత్వ సమర్థవంతమైన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల విజయానికి నిదర్శనం.

పాకిస్థాన్ గణాంకాలు: తిరోగమనంలో ఆర్థిక వ్యవస్థ
ఇందుకు పూర్తి విరుద్ధంగా, పాకిస్థాన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2017-18 మరియు 2020-21 మధ్య కాలంలో, కేవలం ఐదేళ్ల లోపే, పాక్‌లో తీవ్ర పేదరికం 4.9 శాతం నుండి మూడు రెట్లకు పైగా పెరిగి 16.5 శాతానికి ఎగబాకింది. రోజుకు $4.2 ప్రతి వ్యక్తి ఆదాయ ప్రాతిపదికన పాకిస్థాన్‌లో మొత్తం పేదరికం 2017లో 39.8 శాతం నుండి 2021లో 44.7 శాతానికి పైగా పెరిగింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా అంతర్జాతీయ సంస్థలు, మిత్ర దేశాల నుండి వచ్చే రుణాలపై ఆధారపడి ఉంది. ఐఎంఎఫ్ నుండి ఇప్పటికే 25 బెయిలౌట్ ప్యాకేజీలు పొందినా, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, నిధుల దుర్వినియోగం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

ఈ గణాంకాలు రెండు దేశాల మధ్య అభివృద్ధి దృక్పథంలో ఉన్న అగాధాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్ ఆర్థిక స్వావలంబన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతుంటే, పాకిస్థాన్ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతూ, తప్పుడు ప్రాధాన్యతలతో సతమతమవుతోంది. నిధుల కేటాయింపులో పారదర్శకత లోపించడం, సైనిక వ్యయం అధికంగా ఉండటం, ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరి వంటివి పాక్ దుస్థితికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ బ్యాంకు నివేదిక, సరైన విధానాలు, దృఢ సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చని భారత్ నిరూపిస్తుండగా, తప్పుడు ప్రాధాన్యతలు ఎంతటి పతనానికి దారితీస్తాయో పాకిస్థాన్ ఉదంతం ప్రపంచానికి ఒక గుణపాఠంగా నిలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *