కాళేశ్వరంపై 40 నిమిషాల పాటు హరీశ్ రావు విచారణ.. సీడబ్ల్యూసీ వల్లే డిజైన్ మార్చినట్లు వెల్లడి

V. Sai Krishna Reddy
2 Min Read

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు దారితీసిన పరిస్థితులు, బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పలు కీలక అంశాలపై హరీశ్ రావు కమిషన్‌కు తన వాదనలు వినిపించారు. ప్రాజెక్టు లేఅవుట్‌ను చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు.

రీడిజైన్‌కు బలమైన కారణాలు

కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేయడానికి ప్రధానంగా మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి వచ్చిన అభ్యంతరాలే కారణమని హరీశ్ రావు కమిషన్‌కు తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందని, ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ రెండు వేర్వేరు లేఖల ద్వారా తెలిపిందని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించిందని ఆయన అన్నారు. ఈ లేఖలను కూడా కమిషన్‌కు సమర్పించినట్లు చెప్పారు.

“తమ్మిడిహట్టి వద్దే బ్యారేజీ నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రిని కూడా కోరాం. కానీ, ఏకపక్షంగా పనులు మొదలుపెడితే ఖర్చు వృథా అవుతుందని వారు చెప్పారు” అని హరీశ్‌రావు వివరించారు. అనంతరం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాటి సీఎం ఫడ్నవీస్‌ను కలిసి తమ్మిడిహట్టి వద్ద అనుమతి ఇవ్వాలని, ఎంత నష్టపరిహారమైనా చెల్లిస్తామని కోరినట్లు తెలిపారు.

“ఏడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం (మహారాష్ట్ర, కేంద్రం, తెలంగాణలో) తమ్మిడిహట్టి ఒప్పందం కుదర్చడంలో విఫలమైంది. అలాంటిది మేమెలా ఒప్పుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు” అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాస్కోప్ సంస్థ ద్వారా సర్వే చేయించిన తర్వాత ప్రాజెక్టు స్థలాన్ని మార్చాల్సి వచ్చిందని కమిషన్‌కు స్పష్టం చేశారు.

బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణపై వివరణ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం గురించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా, అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందని హరీశ్ రావు తెలిపారు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌లో మార్పులు జరిగాయని, గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి స్థల మార్పులు జరిగాయని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించవద్దని విశ్రాంత ఇంజినీర్లు సూచించడంతో, వారి సలహా మేరకే స్థలం మార్చినట్లు వివరించారు.

ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, దీనికి కూడా మంత్రివర్గ ఆమోదం, ప్రభుత్వ గ్యారెంటీ ఉన్నాయని హరీశ్ రావు కమిషన్‌కు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆనకట్టల్లో నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించగా, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ అనేది పూర్తిగా ఇంజినీర్లు చూసుకునే సాంకేతిక అంశమని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హరీశ్ రావు వివరించారు.

విచారణ అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ, “కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అన్ని ఆధారాలు సమర్పించాను. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలా సేపు ప్రశ్నించారు. వాస్తవాలను వివరించాను” అని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *