అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం వారాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఫెడరల్ ప్రభుత్వం నగరవ్యాప్తంగా చేపట్టిన ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రదర్శనకారులకు, నేషనల్ గార్డ్ దళాలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం నాటికి మరింత ఉధృతమయ్యాయి.
నగరంలోని డౌన్టౌన్ లాస్ ఏంజిల్స్, బోయల్ హైట్స్ ప్రాంతాలు నిరసనలకు ప్రధాన వేదికలుగా మారాయి. వందలాది మంది ఆందోళనకారులు మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ తో పాటు ఇతర ఫెడరల్ భవనాల వైపు దూసుకెళ్లారు. ఆదివారం నాడు కొందరు నిరసనకారులు రద్దీగా ఉండే 101 ఫ్రీవేపైకి ప్రవేశించి, ఇరువైపులా ట్రాఫిక్ను పూర్తిగా స్తంభింపజేశారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. “అధికారులపై వస్తువులు విసిరే వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తాం” అని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుంపులను చెదరగొట్టడానికి ఫ్లాష్ బ్యాంగ్లు, టియర్ గ్యాస్ వంటి చర్యలను పోలీసులు ఉపయోగించారు.
ఈ ఘర్షణల సమయంలో పలువురు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గాయపడినట్లు ఫెడరల్ అధికారులు తెలియజేశారు. ఒక్క శుక్రవారం రాత్రే కనీసం 29 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఫెడరల్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనకారులు, వలసదారుల హక్కుల సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ చర్యలు స్థానిక సమాజాలలో భయాందోళనలు, ఆగ్రహాన్ని రేకెత్తించాయని వారు ఆరోపించారు.
కాలిఫోర్నియాకు 2వేల మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. నిరసనకారులను హింసాత్మక గుంపులుగా అభివర్ణించిన ఆయన, ఫెడరల్ ఆస్తులను కాపాడతామని, నగరంలో శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అయితే, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మాత్రం ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్య అని, ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇది రాష్ట్ర సార్వభౌమాధికారానికి తీవ్ర భంగం అని న్యూసమ్ పేర్కొన్నారు.
వెస్ట్లేక్, పారామౌంట్ వంటి ఇతర ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ వారాంతపు ఘటనలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నగరానికి, ఫెడరల్ అధికారులకు మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సమాజ పెద్దలు, అధికారులు పిలుపునిస్తున్నారు.