అంతరిక్ష రంగంలో రష్యా మరో కీలక ముందడుగు వేసింది. కక్ష్యలో తిరిగే అంతరిక్ష కేంద్రాల (ఆర్బిటల్ స్టేషన్ల) నుంచి వ్యోమనౌకలను ఆటోమేటిక్గా ప్రయోగించడంతో పాటు, ఆ స్టేషన్ల నిర్వహణను రోబోలతో చేపట్టేందుకు వీలు కల్పించే ఓ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ వినూత్న ఆవిష్కరణకు రష్యా పేటెంట్ కూడా పొందింది. ప్రపంచంలోనే ఇటువంటి టెక్నాలజీ ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో నిర్మించనున్న రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ (ఆర్ఓఎస్)లో పరీక్షించనున్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో చేపట్టే చంద్రుడిపైకి యాత్రలకు (లూనార్ మిషన్లు) కూడా దీనిని ఉపయోగించాలని రష్యా ప్రణాళికలు రచిస్తోంది. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంటురోవ్ ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి సంబంధించిన వివరాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వివరించారు. 2030 నాటికి రష్యా సొంతంగా, దశలవారీగా తమ ఆర్బిటల్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.
శుక్రవారం జరిగిన జాతీయ ప్రాజెక్టుల పురోగతిపై, ముఖ్యంగా అంతరిక్ష రంగంలో జరుగుతున్న పనులపై అధ్యక్షుడు పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాంటురోవ్ మాట్లాడుతూ, “రష్యన్ ఆర్బిటల్ స్టేషన్ (ఆర్ఓఎస్) ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రోన్ ప్లాట్ఫామ్గా మారనుంది. దీని నిర్వహణకు అవసరమైన రోబోలతో ఇది సన్నద్ధమవుతుంది. ఇది రష్యన్ ఫెడరేషన్ పేటెంట్ పొందిన పరిష్కారం” అని తెలిపినట్లు భారతీయ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.