బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి ఆర్బీఐ త్వరలోనే నూతన మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక సమాచారాన్ని పంచుకున్నారు.
ముఖ్యంగా, రెండున్నర లక్షల రూపాయల కంటే తక్కువ విలువైన బంగారు రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి పెంచనున్నట్లు మల్హోత్రా తెలిపారు. ఈ సవరించిన మార్గదర్శకాలను శుక్రవారం (జూన్ 6) సాయంత్రం గానీ, లేదా సోమవారం (జూన్ 9) గానీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో తక్కువ మొత్తంలో బంగారంపై రుణం తీసుకునేవారికి ప్రయోజనం చేకూరనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకే ఆర్బీఐ మార్గదర్శకాలను సవరిస్తోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు జారీ చేసే పసిడి రుణాల విషయంలో ఒకే రకమైన, స్పష్టమైన నియమ నిబంధనలు ఉండాలన్నది ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే రుణ గరిష్ఠ విలువ, తనఖా రుణం యొక్క తీరు, తిరిగి చెల్లించే పద్ధతులకు సంబంధించిన నియమాలతో కూడిన ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ గతంలోనే జారీ చేసింది. తాజా మార్పులు ఈ ముసాయిదాను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది.
ఆర్బీఐ గవర్నర్ నుంచి ఈ సానుకూల ప్రకటన వెలువడటంతో బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేసే సంస్థల షేర్లలో మంచి ఉత్తేజం కనిపించింది. మణప్పురం ఫైనాన్స్ షేర్లు సుమారు 3 శాతం మేర, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు సుమారు 5 శాతం మేర లాభపడ్డాయి.