ఆత్మకూరు, జూన్ 05 (ప్రజాజ్యోతి)::
తెలంగాణ లోనే అతిపెద్ద శివాజీ విగ్రహన్ని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆరె సంక్షేమ సంఘం కమిటీ సభ్యులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహ దాత డుకిరే హంసరావును ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆరే సంక్షేమ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అంతకుముందు డీజే, కోలాటాలతో ర్యాలీని నిర్వహించారు. శివాజీ మహరాజ్ తన పాలనలో హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి, మరాఠా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఒక ఆదర్శవంతమైన పాలకుడిగా, అసమానమైన వ్యూహకర్తగా చిరస్మరణీయుడు అని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గొప్ప రాజులలో ఒకరు అని, ఆయన కేవలం యుద్ధ తంత్రాలలోనే కాకుండా, పరిపాలనా విధానంలో కూడా గొప్ప సంస్కర్త అన్నారు. శివాజీ ప్రజల పాలకుడిగా వ్యవహరించాడు. పరకాల నియోజకవర్గం లో ఆరే సంక్షేమ భవనానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉంటూ, ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేశారని, సరళమైన, సమర్థవంతమైన పాలన కొనసాగించాడని అన్నారు. శివాజీ గొప్ప తనాన్ని భావి తరాలకు తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగ కరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి శివాజీ, నాగుర్ల వెంకన్న, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరె కుల సంఘం నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.