ప్రశాంత్ కిశోర్ పై పరువునష్టం దావా వేసిన బీహార్ మంత్రి

V. Sai Krishna Reddy
1 Min Read

జన సూరజ్ పార్టీ (జేఎస్‌పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి పరువు నష్టం దావా వేశారు. అశోక్ చౌదరిపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ దావా వేశారు.

గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె శాంభవికి ఎంపీ టికెట్ కోసం లోక్ శక్తి (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లంచం ఇచ్చారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన అశోక్ చౌదరి.. తనపై అసభ్య ఆరోపణలు చేసి, తన పరువుకు నష్టం కలిగించినందుకు దావా వేసినట్లు తెలిపారు.

తనపై చేసిన ఆరోపణలను ప్రశాంత్ కిషోర్ వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని అశోక్ చౌదరి డిమాండ్ చేశారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమని రుజువు చేస్తూ ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ కిషోర్ క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్తానని అశోక్ చౌదరి హెచ్చరించారు.

కాగా, మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్ నియోజకవర్గం నుండి లోక్ జన శక్తి పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *