తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2025 సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు 11 శాతం తగ్గినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) వెల్లడించింది. ప్రజల్లో పెరిగిన అవగాహన, డేటా ఆధారితంగా పటిష్టమైన నిఘా, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం వంటి కారణాల వల్లే ఇది సాధ్యమైందని పోలీస్ శాఖ అధికారులు తెలిపారు.
టీజీసీఎస్బీ అందించిన వివరాల ప్రకారం, 2024లోని మొదటి నాలుగు నెలలతో పోలిస్తే, 2025 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో సైబర్ నేరాల ఫిర్యాదులతో పాటు వాటి ద్వారా జరిగే ఆర్థిక నష్టాలు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలు, చురుకైన దర్యాప్తు, డేటా విశ్లేషణ ఆధారంగా అమలు చేసిన వ్యూహాత్మక కార్యకలాపాలు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం వంటి అంశాలు ఈ సానుకూల మార్పునకు దోహదపడ్డాయని బ్యూరో పేర్కొంది.
ఈ విషయంపై టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, “2024 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంతో పోలిస్తే, 2025 ఇదే కాలంలో రాష్ట్రంలో ఆర్థిక సైబర్ నేరాల ఫిర్యాదులు 11 శాతం తగ్గాయి. అంతకుముందు త్రైమాసికం (2024 సెప్టెంబర్-డిసెంబర్)తో పోల్చినా కూడా 5.5 శాతం తగ్గుదల కనిపించింది. ఇదే సమయంలో, దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు 28 శాతం పెరగడం గమనార్హం” అని వివరించారు.
ఆర్థిక నష్టాల గురించి ఆమె ప్రస్తావిస్తూ, “తెలంగాణలో సైబర్ నేరాల ద్వారా ప్రజలు కోల్పోయిన మొత్తం సొమ్ము 2024 జనవరి-ఏప్రిల్ కాలంతో పోల్చినప్పుడు 2025లో 19 శాతం తగ్గింది. ఇది అంతకు ముందు త్రైమాసికంతో (2024 సెప్టెంబర్-డిసెంబర్) పోలిస్తే 30 శాతానికి పైగా తక్కువ. జాతీయ స్థాయిలో ఇదే కాలంలో సైబర్ నేరాల వల్ల ఆర్థిక నష్టాలు 12 శాతం పెరిగాయి” అని తెలిపారు. పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసే విషయంలో కూడా తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచిందని, 2024లో 13 శాతంగా ఉన్న రికవరీ రేటు 2025లో 16 శాతానికి పెరిగిందని టీజీసీఎస్బీ డైరెక్టర్ వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సమర్థత, బ్యాంకులు మరియు ఇతర వేదికలతో మెరుగైన సమన్వయం ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు.