హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న రహదారిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడి, ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు ఆ దారిలో వెళ్తుండగా నలుగురు దుండగులు వారిని అడ్డగించారు. బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారు ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖాజాగూడకు చెందిన జయంత్ గౌడ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో, అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.