ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు క్షమాపణలు తెలిపారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన పరిణామాలపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సునీత రావు మాట్లాడుతూ, “గాంధీ భవన్లో చోటుచేసుకున్న విషయాలు చాలా బాధాకరమైనవి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దీనికి నేను, నా మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేసినా బాధ్యత నాదే” అని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్ద మనసు చేసుకొని తనను, మహిళా కాంగ్రెస్ నాయకులను క్షమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ అధిష్టానాన్ని మీడియా వేదికగా కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు, ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబాను కూడా స్వయంగా కలిసి మాట్లాడినట్లు సునీత రావు వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్కు పెద్దపీట వేస్తానని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరికీ సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సునీత రావు కొట్టిపారేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, మొగలి సునీత రావు ఇటీవల గాంధీ భవన్లో మహిళా నాయకులతో కలిసి పీసీసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అలాగే, సునీత రావు పార్టీ మారుతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సునీత రావు మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణ చెప్పడంతో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదానికి తెరపడినట్లయింది.