కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు నోటీసులు అందుకున్నంత మాత్రాన ఉలికిపాటు ఎందుకని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు.
హైదరాబాద్ సచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు అందిన వెంటనే దానిని తప్పుబడుతూ మాట్లాడటం విచారకరమని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు సైతం విచారణ కమిషన్ల ముందు హాజరైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నోటీసులు ఇచ్చాక, చట్టబద్ధంగా ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్నే కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకే ఈ కమిషన్ను వేశామని ఆయన పునరుద్ఘాటించారు.
మేడిగడ్డ వద్ద బాంబులు వేశారని కొందరు ఆరోపిస్తున్నారని, ఆ సమయంలో వారే ప్రభుత్వంలో ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. “ఒకవేళ నిజంగానే మేడిగడ్డ వద్ద బాంబులు వేసి ఉంటే, అప్పటి ఎఫ్ఐఆర్లో ఆ విషయం ఎందుకు నమోదు చేయలేదు?” అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ‘తెల్ల ఏనుగు’తో పోలుస్తూ కాగ్ తన నివేదికలో పేర్కొందని మంత్రి తెలిపారు.
కేవలం కొందరు బీఆర్ఎస్ నేతలు తమ జేబులు నింపుకోవడానికే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చారని ఆయన ఆరోపించారు. డీపీఆర్లో సూచించిన ప్రదేశానికి బదులుగా మరోచోట ప్రాజెక్టును నిర్మించడం వల్లే వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని, అయితే అదనపు ఆయకట్టు మాత్రం నామమాత్రంగానే పెరిగిందని వివరించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చారని ఆయన దుయ్యబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భారంగా మారబోతోందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుగానే హెచ్చరించాయని మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చట్టం కూడా బీఆర్ఎస్ ఎంపీల మద్దతుతోనే పార్లమెంటులో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, రీడిజైనింగ్, నిర్మాణంలో అనేక లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని వెల్లడించారు. కూలిపోయిన ఈ ప్రాజెక్టును అద్భుతమని చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై తమ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పునాదుల్లోనే అనేక లోపాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు. జ్యుడీషియల్ కమిషన్ ముందు హాజరై, తమ వాదనలు ఏమిటో స్పష్టంగా వినిపించాలని ఆయన బీఆర్ఎస్ నేతలకు సూచించారు