హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం.. నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!

V. Sai Krishna Reddy
2 Min Read

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తూ, నకిలీ పత్రాలతో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన మయన్మార్ దేశస్థుల ముఠా గుట్టు రట్టయింది. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో మయన్మార్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కొన్నేళ్ల క్రితం మయన్మార్ నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి, ఇక్కడ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మదర్సాలో పనిచేసే కొందరు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తేలింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మయన్మార్‌కు చెందిన మహ్మద్ అమీన్, ఆయన భార్య మహ్మద్ రుమానా అక్తర్, వారి కుమారుడు మహ్మాద్ నయీమ్ 2011 సంవత్సరంలో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. అనంతరం 2014లో హైదరాబాద్ నగరానికి చేరుకుని, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు. మహ్మద్ అమీన్ స్థానికంగా ఓ బ్యాటరీ దుకాణాన్ని నడుపుతున్నాడు.

వారు అక్రమంగా ఆధార్ కార్డులు పొందిన వైనంపై పోలీసులు దృష్టి సారించారు. మదర్సాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహ్మద్ హారీస్, అయాజ్‌ల సహాయంతో మహ్మద్ అమీన్ మంచాల గ్రామంలోని మీ-సేవా కేంద్రం ద్వారా ఆధార్ కార్డు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత, నకిలీ వివాహ ధృవపత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా తన భార్య రుమానా అక్తర్‌కు కూడా ఆధార్ కార్డు ఇప్పించాడు. ఇక వీరి కుమారుడైన నయీమ్‌కు, మయన్మార్ నుంచే అక్రమంగా వచ్చి బాలాపూర్‌లో స్థిరపడిన షోయబ్ మాలిక్ అనే వ్యక్తి నకిలీ పత్రాలతో ఆధార్ కార్డు వచ్చేలా చేశాడు.

ఈ కుటుంబం తప్పుడు పత్రాలను సమర్పించి ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన వ్యవహారంపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు, వాటి ఆధారంగా పొందిన పాన్ కార్డులు, గ్యాస్ బుక్‌లు, బ్యాంకు ఖాతాలు, పాస్‌బుక్‌లు వంటి ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి సహకరించిన అయాజ్, షోయబ్ మాలిక్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *