అదృశ్యమైన సరస్వతి నది తెలంగాణలో ఎలా.

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలా? అంటూ ఆశ్చర్యానికి గురయ్యే వారు లేకపోలేదు. మరికొందరు అయితే.. అప్పుడెప్పుడో అదృశ్యమైన సరస్వతి నదికి పుష్కరాలా? అంటూ ప్రశ్నిస్తుంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకు వేసి.. సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణకు లింకు ఏంటి? లాజిక్ ఏంటి? అంటూ ప్రశ్నించేవారు లేకపోలేదు. ఈ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు సాగే సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేసి.. తెలంగాణలో సరస్వతి పుష్కరాలను చేసుకోవాల్సిన అవసరం ఏమిటో చెప్పే కథనమిది. సరస్వతి నది ప్రస్తావన రుగ్వేదంలో ఉంది. హిమాలయ పర్వతశ్రేణిలోని శివాలిక్ కొండల్లో ఈ నది ప్రవహించినట్లుగా అందులో పేర్కొన్నారు.బ్రహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. మిథున రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరాలు జరుపుతారు. పాకిస్తాన్ లోని హక్రా.. భారతదేశంలో గగ్గర్ నదినే నాటి సరస్వతి నదిగా చరిత్రకారులు.. భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై.. పంజాబ్..హర్యానా.. రాజస్థాన్.. గుజరాత్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించిందని చెబుతారు.
వేల ఏళ్ల క్రితం భూగర్భం.. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సరస్వతి నది అదృశ్యమైంది. కానీ.. భూగర్భంలో ఇంకా ఆ నది ప్రవహిస్తుందని.. కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుందన్నది ఒక నమ్మకం. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పుర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందన్నది పండితుల మాట
దీనికి తోడు ఇక్కడ మహా సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దీంతో.. ఇక్కడ సరస్వతి నది పుష్కరాల్ని నిర్వహిస్తున్నారు. బద్రినాథ్ సమీపంలోని మనా గ్రామంలో సరస్వతి నదిని చూడొచ్చు. అక్కడ కొంతదూరం ప్రవహించి.. అలకనంద నదిలో కలుస్తుంది. ప్రయాగ్ రాజ్ లో గంగా.. యమునా.. నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతుంది. ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం.. రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో బ్రహ్మ ఆలయం.. మధ్యప్రదేశ్ లోని బేడాఘాట్ వద్ద సరస్వతి నది పుష్కరాల్ని నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఏపీలో 2013లో ఈ పుష్కరాల్ని నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి పుష్కరాలుగా వీటిని చెప్పాలి. తాజాగా పుష్కరాలు నిర్వహిస్తున్న కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *