అణు క్షిపణులు కాదు, వస్తువులు వర్తకం చేసుకోండి: భారత్, పాకిస్థాన్‌కు ట్రంప్ హితవు

V. Sai Krishna Reddy
1 Min Read

రియాధ్: భారత్, పాకిస్థాన్ దేశాలు అణు క్షిపణులతో దాడులు చేసుకోవడం మాని, ఇరు దేశాల్లో అందంగా తయారయ్యే వస్తువులను పరస్పరం వర్తకం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. మంగళవారం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన, రియాధ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండోసారి శ్వేతసౌధంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ చేపట్టిన తొలి ప్రధాన విదేశీ పర్యటనలో భాగంగా ఆయన పశ్చిమాసియాలో పర్యటిస్తున్నారు.

“కొన్ని రోజుల క్రితమే నా ప్రభుత్వం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రమవుతున్న హింసను ఆపేందుకు చారిత్రాత్మక కాల్పుల విరమణ ఒప్పందాన్ని విజయవంతంగా కుదిర్చింది. దీనికోసం నేను వాణిజ్యాన్ని బాగా ఉపయోగించాను,” అని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా హాజరైన సభలో ట్రంప్ తన విదేశాంగ విధానంపై ప్రసంగిస్తూ తెలిపారు. “మిత్రులారా, రండి… ఓ ఒప్పందం చేసుకుందాం. కొంత వర్తకం చేద్దాం. అణు క్షిపణులను వర్తకం చేసుకోవద్దు. మీరు ఎంతో అందంగా తయారుచేసే వస్తువులను వర్తకం చేసుకుందాం,” అని తాను భారత్, పాకిస్థాన్‌లకు చెప్పినట్లు ట్రంప్ వివరించారు.

ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన కృషిని ట్రంప్ ప్రత్యేకంగా ప్రశంసించారు. “చిన్నగా మొదలైన ఆ ఘర్షణ రోజురోజుకూ పెద్దదై లక్షలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉండేది,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాల్లోనూ శక్తివంతమైన, బలమైన, మంచి, తెలివైన నాయకులు ఉన్నారని, వారి వల్లే అంతా సద్దుమణిగిందని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన “అవగాహన” ఫలితంగానే ఘర్షణ సద్దుమణిగిందని భారత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో ఘర్షణలను పరిష్కరించే శాంతికాముకుడిగా తన పాత్రను ట్రంప్ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అనంతరం రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఆయన మాట్లాడారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *