ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్కు ముంబై విమానాశ్రయంలో ఊహించని పరిణామం ఎదురైంది. టర్కీ పర్యటనకు సిద్ధమైన తనను, తన బృందాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది విమానం ఎక్కకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ మరియు సంబంధిత సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శాంతి చర్చల కోసం తాను టర్కీ వెళుతుంటే విమానం ఎక్కనివ్వలేదని కేఏ పాల్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ముంబై నుంచి ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన 6E 017 విమానంలో తాము టర్కీకి ప్రయాణించాల్సి ఉందని, అయితే, విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో ఇండిగో సిబ్బంది తమను అడ్డుకున్నారని ఆరోపించారు.
తమ ప్రయాణాన్ని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారంటూ, ఈ మేరకు ఆయన ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓతో పాటు, తమను అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తాను 37 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నానని, తాజాగా పాక్ తో ఉద్రిక్తతలపై ట్రంప్, అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్ లో మాట్లాడానని, ఇప్పుడు టర్కీ వెళుతుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.