ఆపరేషన్ సిందూర్’పై ఆర్మీ మీడియా సమావేశం.. తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ

V. Sai Krishna Reddy
1 Min Read

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను వెల్లడించేందుకు భారత సైన్యం సిద్ధమైంది. ఈ ఉదయం 10:30 గంటలకు ఆర్మీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి సరిహద్దులో జరిగిన పరిణామాలను వివరించనున్నారు. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సౌత్ బ్లాక్‌కు చేరుకుని త్రివిధ దళాధిపతులతో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

శుక్రవారం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ పలు క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా ఎస్-400 క్షిపణి వ్యవస్థ ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించాయి.

ఈ దాడులకు ప్రతిగా, భారత సాయుధ బలగాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ప్రతీకార దాడులు నిర్వహించాయి. లాహోర్‌లోని పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. సర్ఘోదా వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, జెఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలను భారత దళాలు కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా, గురువారం రాత్రి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నాలను కూడా భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో 50కి పైగా పాకిస్థాన్ డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం నిర్వహించబోయే మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సమావేశంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *